→అణ్వాయుధ పరీక్షలతో ఉత్తర కొరియా సొంత ప్రజలనే కాదు, పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్వాసుల ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తోంది.
→ ఉత్తర కొరియాలోని ‘పుంగేరి’ భూగర్భ అణు పరీక్షా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రయోగాలు ఎంతటి విపత్తును కలిగిస్తున్నాయో సియోల్కు చెందిన మానవ హక్కుల సంఘం తాజా అధ్యయనంలో వెల్లడించింది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, దీంతో ప్రజలకు రేడియోధార్మికత ముప్పు పొంచి ఉందని వెల్లడించింది.
→ ఉత్తర కొరియా 2006 - 17 మధ్యకాలంలో ఉత్తర హమ్గ్యోంగ్ ప్రావిన్స్లోని పుంగేరి కేంద్రంలో రహస్యంగా ఆరు అణ్వాయుధ పరీక్షలు నిర్వహించింది.
→ఈ క్రమంలో ఇక్కడి నుంచి భూగర్భ జలాల ద్వారా రేడియోధార్మిక పదార్థాలు స్థానికంగా ఎనిమిది నగరాలు, కౌంటీల్లో విస్తరించి ఉండొచ్చని ‘ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్’ పేర్కొంది.
→ఈ ప్రాంతాల్లో పది లక్షలకుపైగా జనాభా నివసిస్తోంది. తాగునీటితో సహా రోజువారీ కార్యకలాపాల్లో వారు భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు.
→ ఉత్తర కొరియా నుంచి పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్లకు అక్రమంగా రవాణా అయ్యే వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల కారణంగా అక్కడి ప్రజలూ కొంతవరకు ప్రమాదంలో పడొచ్చని నివేదిక పేర్కొంది.
→ 2015లోనే దక్షిణ కొరియా ఆహార భద్రతా సంస్థ తాము దిగుమతి చేసుకున్న పుట్టగొడుగుల్లో సాధారణం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా రేడియోధార్మిక సీజీయం ఐసోటోపులను గుర్తించినట్లు వెల్లడించింది.
→ ఐరాస, ఇతర ప్రభుత్వ నివేదికలు, అణు, వైద్య నిపుణులతో పాటు ఉత్తర కొరియా నుంచి తప్పించుకు వచ్చిన పౌరుల సమాచారం విశ్లేషణ ఆధారంగా అధ్యయనం కొనసాగింది.
International