→చైనా చిన్నారులు ఇంటర్నెట్కు బానిసలుగా మారిపోయారని జిన్పింగ్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
→ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే తీసుకున్న అనేక చర్యలకు కొనసాగింపుగా తాజా నిబంధనలు రూపొందించింది.
→ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే విషయంలో చైనాలో ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి.
→చిన్నారులు పగటిపూట ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే సమయాన్ని 90 నిమిషాలకే పరిమితం చేస్తూ 2019లో ఆంక్షలు విధించింది.
→శుక్ర, శని, ఆదివారాలతో పాటు సెలవుల రోజుల్లో ఈ సమయాన్ని గంటకే పరిమితం చేస్తూ 2021లో నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
→తాజాగా చైనా చిన్నారులకు స్మార్ట్ఫోను వాడకంపై మరిన్ని సరికొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
→మైనర్లు స్మార్ట్ఫోను ఉపయోగించే సమయాన్ని రోజుకు గరిష్ఠంగా రెండు గంటలకు పరిమితం చేస్తూ జిన్పింగ్ సర్కారు ఆంక్షలను తీసుకొస్తోంది.
→చైనా అంతర్జాల నియంత్రణ సంస్థ అయిన ‘సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా’ (సీఏసీ) ఇందుకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది.
→ మైనర్లకు రాత్రి 10.00 నుంచి ఉదయం 6.00 గంటల మధ్య ఇంటర్నెట్లోని చాలా సేవలు మొబైల్ ద్వారా అందుబాటులో ఉండవు.
→16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారు రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.
→ 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఈ సమయం గంటకే పరిమితం.
→ ఎనిమిదేళ్లలోపు వారికైతే 40 నిమిషాలు మాత్రమే అంతర్జాలం వాడుకునే అనుమతి ఉంటుంది.
→ఈ ఆంక్షల నుంచి కొన్ని సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు.
→ మైనర్ల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడే యాప్స్, ప్లాట్ఫాంలకు ఆంక్షలు వర్తించవు.
→ఇంటర్నెట్ ప్లాట్ఫాంలలో ‘యూత్ మోడ్’ను తీసుకొచ్చేలా చైనా ఇప్పటికే చర్యలు తీసుకుంది.
→చిన్నారులకు వారి వయసుకు తగిన సమాచారం అందేలా నిబంధనలు తీసుకొచ్చింది.
→ఈ నేపథ్యంలో తాజా ముసాయిదా నిబంధనలపై సెప్టెంబరు 2లోపు స్పందనలు తెలపాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.
International