→ప్రపంచంలో అద్భుతమైన కట్టడాల్లో ఒకటిగా పేరొందిన భారత పార్లమెంటు భవనం ఎన్నో చారిత్రక ఘటనలకు నిలువెత్తు సాక్ష్యం.
→బ్రిటిష్ వలస పాలన, దానికి చరమగీతం పాడుతూ స్వతంత్ర భారతావని ఆవిర్భావం, నూతన రాజ్యాంగం, వినూత్న చట్టాలు, వాదప్రతివాదాలు, వివాదాస్పద శాసనాలు తదితరాలు ఎన్నిటికో వేదికైన ఈ అపురూప కట్టడానికి ప్రారంభోత్సవం జరిగి సరిగ్గా 96 ఏళ్లు పూర్తయ్యాయి.
→1927 జనవరి 18న అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు.
→భారత్లో బ్రిటన్ సామ్రాజ్య రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి తరలించిన నేపథ్యంలో రైసినా హిల్ ప్రాంతంలో 1921 ఫిబ్రవరి 12న పార్లమెంటు భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
→బ్రిటన్ ఆర్కిటెక్ట్లు సర్ హెర్బర్ట్ బాకర్, సర్ ఎడ్విన్ లుటియన్స్లు దీని రూపశిల్పులు.
→560 అడుగుల వ్యాసంతో, మైలులో మూడో వంతు చుట్టు కొలత గలిగిన వలయాకార సుందర కట్టడాన్ని పూర్తి చేయడానికి ఆరేళ్ల సమయం పట్టింది.
→ప్రపంచంలోనే అమోఘమైన పార్లమెంటు భవనంగా ఆనాడు ప్రసిద్ధికెక్కింది.
→ఈ ప్రాంగణంలోనే నిర్మితమవుతున్న కొత్త పార్లమెంటు సముదాయం అందుబాటులోకి వచ్చాక పాత భవనం మన దేశ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
National